Full width home advertisement

Post Page Advertisement [Top]

తెలుగు సాహితీ విశ్వంభరుడు సినారె

 29 July 1931 - 12 June 2017

ఆధునిక తెలుగు సాహిత్యానికి వన్నెలద్దిన మేరు నగధీరుడు.
తెలుగు అక్షరానికి జ్ఞానపీఠాన్ని అందించిన విశ్వంభరుడు.
తెలుగు సాహితీ ప్రస్థానాన్ని దిగంతాలకు చేర్చిన నిత్య సాహిత్య కృషీవలుడు.
తెలుగు సినిమా పాటలకు కొత్తసొబగులు అద్దిన పాటల మాంత్రికుడు.

పద్యం, గేయం, వచనం, పాట, గజల్, బుర్రకథ ఇలా సాహిత్య ప్రక్రియ ఏదైనా ఆయన కలం నుంచి జాలువారే ప్రతి అక్షరమూ ఒక ఆణిముత్యమే. కవిగానే కాకుండా పండితునిగా, పరిశీలకునిగా బహుముఖ ప్రజ్ఞ ఆయన సొంతం. తెలుగు సాహితీ సార్వభౌముడు డాక్టర్ సి.నారాయణ రెడ్డి. సినారెగా సుపరిచితుడైన డాక్టర్ సి. నారాయణ రెడ్డి పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి.
ఆయన 1931 జులై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో జన్మించారు. ఆయన చదువంతా ఉర్దూ మాధ్యమంలో సాగినప్పటికీ తెలుగు సాహిత్యంపట్ల మక్కువ పెంచుకున్నారు. పల్లెపదాలు, వినోదాలు, కథాగానంపై మక్కువ పెంచుకోవడంతో పాటు చిన్నతనంలోనే కవితా ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1953లోనే నవ్వని పువ్వు పేరుతో తొలి కవితా సంపుటిని వెలువరించి అందరి మన్ననలూ అందుకున్నారు. తరువాత విశ్వగీతి, నాగార్జునసాగరం, స్వప్నభంగం, కర్పూర వసంతరాయలు వంటి కవితా సంపుటాలు తీసుకువచ్చారు.

1962లో కళాశాల అధ్యాపకుడిగా ఉన్న సమయంలో ఎన్‌టీ రామారావు కోరిక మేరకు గులేబకావళి కథ సినిమా కోసం తొలిసారి పాట రాశారాయన. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అంటూ సినారె రాసిన తొలిపాటనే ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఇక ఆయన వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు.

అలా 3500లకు పైగా సినిమా పాటలు రాశారు. 1963లో బందిపోటు చిత్రం కోసం వగలరాణివి నీవే సొగసుకాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే... అంటూ ఇష్టసఖిని ప్రేమతో పిలుస్తూనే పిండివెన్నెల నీ కోసం పిల్లతెమ్మెర నాకోసం రెండు కలిసిన నిండుపున్నమి రేయి మనకోసం అంటూ కవ్విస్తాడు ప్రియుడు. ఓహో ఓ ఓ ఓహోహో ఓ ఓ ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఓ.. ఓ అంటూ అమరశిల్పి జక్కన చిత్రం కోసం ఆయన రాసిన పాట అశేష ఆదరణ పొందింది. చూడడానికి నలుపు రంగులో ఉండే రాళ్లను చెక్కితే కొత్త జీవం పోసుకుంటాయంటారాయన.
 తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అమోఘం. 1988లో ఆయన రాసిన విశ్వంభర కావ్యానికి గాను ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె 19 సాహితీ ప్రక్రియల్లో 92 పుస్తకాలు రాశారు. 116 కవితలతో నా రణం మరణంపైనే అనే కవితా సంపుటిని తీసుకువచ్చారు.
 Sinare అన్నా చెల్లెళ్ల అనురాగానికి గీటురాయిగా నిలిచిన అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి- కనిపించని దైవమే ఆ కనులలో ఉన్నది అంటూ అన్నాచెల్లెల మధ్య ఉండే అప్యాయతలు, అనుబంధాలు, అనురాగాల్ని బంగారు గాజులు చిత్రంలో సినారె వివరిస్తారు. కృష్ణానది విశిష్టతను నారాయణరెడ్డి కృష్ణవేణి చిత్రంలో ఎంతో అందంగా వివరించారు. కృష్ణవేణి.. తెలుగింటి విరిబోణి అని నాయిక పాడితే కృష్ణవేణి నా ఇంటి అలివేణి అంటూ కథానాయకుడు గళం కలుపుతాడు. శ్రీ గిరి లోయల సాగేజాడల విద్యుల్లతలు వేయి వికసింపజేసేను అంటూ సాగుతుంది ఈ పాట.
ఇక తండ్రి గొప్పతనాన్ని వివరిస్తూ ధర్మదాత (1970) చిత్రంలో ఆయన రాసిన మరో అద్భుత మైన పాట - ఓ నాన్నా ఓ నాన్నా ఓ నాన్న నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న అంటూ కంటికి రెప్పలా సాకే తండ్రిని ముళ్లబాటలో నీవు నడిచావు. పూలతోటలో మమ్ము నడిపావు అని కీర్తిస్తాడు. అంతేకాదు మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన దేశాన్ని మరిచిపోవద్దంటూ కోడలు దిద్దిన కాపురం చిత్రంలో నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు అంటాడు.
హైదరాబాద్ రిక్షావాలా సినారె వర్ణించినంతగా మరెవరూ వర్ణించలేదేమో అనిపించే గీతం. రింఝిం రింఝిం హైదరాబాద్..రిక్షావాలా జిందాబాద్ - మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటరుకారూ బలాదూర్ అంటాడు మట్టిలో మాణిక్యం చిత్రంలో. స్నేహాన్ని స్నేహితుల గొప్పతనాన్ని వివరిస్తూ సినారె రాసిన అద్భుత గీతాలు 1972లో వచ్చిన బాలమిత్రుల కథ చిత్రంలోనివి.
గున్నమామిడి కొమ్మమీద గూళ్లు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది. ఒక గూటిలోన కోయిలుంది అంటారు సినారె. నిప్పులాంటి మనిషి చిత్రంలో స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ స్నేహన్ని బలపరుస్తుంది.
తనకు ఇష్టమైన కథానాయికను వర్ణిస్తూ అభినవ తారవో.. నా అభిమాన తారవో అభినవ తారవో అంటాడు అభినయ రసమయ కాంతిధారవో మంజుల మధుకర శింజాన సుమశర శింజినీ శివరంజనీ..శివరంజనీ అంటూ పాడుతాడు.
ఒసేయ్ రాములమ్మ చిత్రంలో టైటిల్‌సాంగ్ ఓ ముత్యాల రెమ్మ.. ఓ మురిపాల కొమ్మ.. ఓ పున్నమీ బొమ్మ.. ఓ.. ఒసే రాములమ్మా అంటూ రాసిన గీతం అద్భుతం.
అట్లే తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవ చేసిన సినారె 1981లో అప్పటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మాతృభాష వాడకాన్ని పెంపొందించారు.
1969-73 వరకు రాష్ట్ర సాహిత్య అకాడమీలో చురుకైన పాత్ర,
1992లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో భాషా సాంస్కృతిక సలహాదారులుగా పనిచేశారు.
1997లో మంత్రిహోదాలో సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా నియమితుడై 2004 వరకు పనిచేశారు.
1997 నుంచి ఆరేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.

పాటలో ఏముంది- నా మాటలో ఏముంది అంటూ ఆయన చెప్పిన ముచ్చట్లు 2 పుస్తకాలుగా వచ్చాయి. వారి సతీమణి సుశీల సంస్మరణగా ప్రత్యేక మహిళా పురస్కారం, ఓపెన్ యూనివర్సిటీలో ప్రతిభావంతులైన విద్యార్థులకు స్వర్ణపతకాలు అందిస్తున్నారు.
సినారె కవిత్వం విశిష్టతలపై 10 పీహెచ్‌డీలు, 18 ఎంఫిల్‌లు ఆయా యూనివర్సిటీలు ప్రధానం చేశాయి. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్‌కు 1994 నుంచి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.
ఆయనకు గంగా, యమునా, సరస్వతి, కృష్ణవేణి అనే నలుగురు కూతుళ్లున్నారు. విశ్వంభర, మనిషి-చిలక, ముఖాముఖి, భూగోళమంత మనిషి, దృక్పథం, కలం సాక్షిగా, కలిసినడిచే కలం, కర్పూర వసంతరాయలు, మట్టిమనిషి, ఆకాశం, తేజస్సు నా తపస్సు, నాగార్జున సాగరం, జలపాతం, విశ్వగీతి, విశ్వనాథనాయుడు, కొనగోటిమీద జీవితం, రెక్కల సంతకాలు, వ్యక్తిత్వం మొదలైన కవితా సంపుటాలు, పరిణత వాణి పేరుతో వ్యాసాలు, 1955లో అజంతా సుందరి సంగీతరూపకం రచించారు.
తెలుగు గజల్స్, ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయాలు -ప్రయోగాలు అంశంపై ఆయన చేసిన పరిశోధన గ్రంథానికి డాక్టరేట్ లభించింది.
విశ్వంభర కావ్యానికి జ్ఞానపీఠ్,(1988) లభించింది.
1977లో పద్మశ్రీ,
1978లో కళాప్రపూర్ణ,
 1992లో పద్మభూషణ్‌లు సినారెను వరించాయి.
 స్వాతిముత్యం చిత్రంలో లాలిలాలి లాలీ లాలి వటపత్రశాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి అంటూ బాబును నిద్రపుచ్చుతూ రాసిన పాట నాటికి నేటికి ఎవర్‌గ్రీన్.

సూత్రధారులు చిత్రంలో జోలాజోలమ్మ జోల.. నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల అని జోలపాడుతాడు. అమ్మ గొప్పతనాన్ని కూడా సినారె అద్భుతంగా వర్ణించారు.

20వ శతాబ్ధం చిత్రంలో అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించిన అర్థమున్నదా.. జగమే పలికే శాశ్వత సత్యమిదే అంటూ అమ్మగొప్పతనాన్ని అమృతమంతా మధురంగా వర్ణించాడాయన.

అట్లే ప్రేమించు చిత్రంలో కంటేనే అమ్మ అని అంటే ఎలా కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా అంటాడు.

తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే చలిగాలి రమ్మంటు పిలిచిందిలే చెలిచూపు నీపైన నిలిచిందిలే అంటూ నాయకుని అసలు రూపం తెలుసుకున్న చిత్రనాయిక అతన్ని ఏడిపించాలనే ఉద్దేశంతో పాటందుకుంటుంది రాముడు భీముడు చిత్రంలో.
అరుంధతీ చిత్రంలోనూ జేజమ్మా జేజమ్మా..జేజమ్మా జేజమ్మా వంటి గీతాలెన్నో సినారె కలం నుంచి జాలువారాయి.
తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది అన్న తన పాటకు తెలంగాణ ఉద్యమ సమయంలో రెండుగా వెలుగు జాతి మనది అని మార్చారు.


Thank you Arundathi.   Source - Namaste Telangana Sunday Magazine

2 కామెంట్‌లు:

Bottom Ad [Post Page]